మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమురంభీం–ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉంటాయని, కొన్నిచోట్ల అధికంగా ఉంటుందని వివరించింది.
కాగా, నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు ఇంకా లోటులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే 4 శాతం లోటులో ఉంది. జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు 41.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 39.95 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే... 18 మండలాల్లో అత్యధికం, 111 మండలాల్లో అధికం, 278 మండలాల్లో సాధారణం, 210 మండలాల్లో లోటు, 4 మండలాల్లో తీవ్ర లోటులో వర్షపాతం గణాంకాలు నమోదయ్యాయి.


