జూరాలకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 1.68 లక్షల క్యూసెక్కుల విడుదల
గద్వాల/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు 1,73,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 21 గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా 1,38,495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల వుతున్న నీటితో కలిపి మొత్తం 1,68,020 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. శనివారం సాయంత్రానికి 317.31 మీటర్లకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.567 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.297 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 877.70 అడుగులుగా నమో దైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండు కేంద్రాల నుంచి కలిపి 62,493 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్కు వెళ్తోంది.
కాగా, ప్రస్తుతం ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇదే స్థాయిలో మరో మూడు, నాలుగు రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ఫ్లోగా సుమారు 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1,26,231 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.


