
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది.
లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.
అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది.