ముంబై బీఎండబ్ల్యూ కేసు.. కీల‌క నిందితుడి అరెస్ట్‌ | Mumbai BMW Hit And Run Case: Absconding Accused Mihir Shah Arrested | Sakshi
Sakshi News home page

Mumbai: బీఎండబ్ల్యూ కారు ప్ర‌మాదం కేసు.. కీల‌క నిందితుడు అరెస్ట్‌

Jul 9 2024 4:30 PM | Updated on Jul 9 2024 5:37 PM

Mumbai BMW Hit And Run Case: Absconding Accused Mihir Shah Arrested

ముంబై:  ముంబైలోని వ‌ర్లీలో జ‌రిగిన బీఎండ‌బ్ల్యూ కారు రోడ్డు ప్ర‌మాదం కేసులో కీల‌క పురోగ‌తి చోటుచేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో ల‌గ్జ‌రీ కారు న‌డుపుతూ  దంప‌తుల‌ను ఢీకొట్టి మ‌హిళ ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్ర‌‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి అత‌డు ప‌రారీలో ఉండ‌గా.. 72 గంట‌ల త‌ర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్‌మెంట్‌లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.  అతని తల్లి, సోదరిని కూడా  అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

అయితే గ‌త మూడు రోజులుగా కొడుకును దాచి పెట్ట‌డంతో తండ్రి, శివ‌సేన(ఏక్‌నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అత‌డి తప్ప‌తాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను పోలీసులు సీజ్ చేశారు. 

కాగా ఈ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్‌ షా కారు త‌న‌ బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన్న‌ట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

కారు బ‌లంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడ‌గా.. అలాగే కిలోమీటర్‌ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్‌ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు
 

అస‌లేం జ‌రిగిందంటే.. 
ముంబైలోని వర్లీలో ఆదివారం ఉద‌యం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్‌ షా పేరుతో రిజిస్టర్ అయింది.   ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.
కారు

నిందితుడు మిహిర్‌ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్‌లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.

కాగా ఈ  ప్ర‌మాదం పుణెలో జ‌రిగి పోర్చే కారు ప్ర‌మాద ఘ‌ట‌న‌ను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైన‌ర్ బాలుడు మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపి ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంత‌రం నిందితుడు త‌ల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివ‌రికి నిందితుడైన మైన‌ర్‌ను అత‌ని అత్త సంర‌క్ష‌ణ‌లో ఉండేలా న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement