హత్యకు ఉపయోగించిన కర్ర,చీర.... సత్యనారాయణ (ఫైల్), సునీత
భర్తను హతమార్చిన భార్య
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
మేడిపల్లి: భర్తను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య ను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51) సునీత దంపతులు. రాత్రి విధులు ముగించుకొని ఆగస్టు 6న మధ్యాహ్నం సత్యనారాయణ ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30కు ఇంటికి వచ్చింది. సత్యనారాయణ మద్యం సేవించి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
భర్త ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత.. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో తలపై, ఇతర భాగాలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. కాగా, దాడి అనంతరం సునీత కుమారుడికి ఫోన్ చేసి సత్యనారాయణ వాహనంనుంచి కింద పడినట్లు చెప్పింది. మొదట బోడుప్పల్లోని ఓ ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 10.18 గంటలకు సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు కేసును మొదట రోడ్డు ప్రమాదంగా నమోదు చేసినప్పటికీ అనంతరం దర్యాప్తులో సత్యనారాయణను భార్య హత్యచేసినట్లు గుర్తించారు. తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే హత్యచేసినట్లు సునీత అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సునీతను కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు.


