- పశ్చిమ బెంగాల్లోని హల్దియా రిఫైనరీలో తెల్లవారుజామున చెలరేగిన మంటలు.
- నాఫ్తా రవాణా చేసే పైప్లైన్లో మంటలు అంటుకోవడమే కారణం.
- సుమారు 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఆయిల్ రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా రవాణా చేసే ప్రధాన పైప్లైన్లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
VIDEO | West Bengal: A massive fire broke out suddenly in naphtha-carrying pipeline at the Haldia Refinery between 4.00-4.30 AM on Tuesday. Several workers were reportedly injured in the incident. More details are awaited.#Haldia #Fire
(Full video available on PTI Videos -… pic.twitter.com/Nz7uHdlIgS— Press Trust of India (@PTI_News) June 30, 2026
తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైప్లైన్ నుంచి మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పలువురు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. రిఫైనరీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో హల్దియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.
ఇది కూడా చదవండి: ‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం


