నలసోపారా: ప్రతి పుట్టినరోజు వేడుకలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆహార పదార్థం కేక్. అతిథుల నుంచి పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ కేక్ కోసం ఎదురుచూస్తారు. అయితే, అదే కేక్ వల్ల కొందరు ఆసుపత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన బల్లి ఉన్న కేక్ తినడంతో 11 మంది అస్వస్థతకు గురయ్యారు.
కేక్ తిన్న కొద్దిసేపటికే ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు అకస్మాత్తుగా కడుపు, ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. వారందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆహార భద్రత, బేకరీ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది.
రెండు రోజుల ముందే థానేలోని కల్యాణ్లో గోద్రేజ్ హిల్ ప్రాంతంలోని బ్లింకిట్ దుకాణంలో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో ఎలుక పరుగెత్తినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి.
మరోవైపు, మలాడ్ వెస్ట్లో బ్లింకిట్తో సంబంధం ఉన్న మరో కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో ఆ కేంద్రం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను సస్పెండ్ చేశారు.
మహారాష్ట్ర అంతటా ఇన్స్టాంట్ సర్వీసు వేదికలకు సంబంధం ఉన్న కేంద్రాలను ఆహార భద్రత అధికారులు ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.


