చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆయన తల్లిపై అవమానకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు అందింది. డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని, పరువునష్టం, బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తనకు సంబంధించి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పోలీసులను కోరారు.
శనివారం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. అసెంబ్లీలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్ చేసిన “కుట్టి కథై” (చిన్న కథ) వ్యాఖ్యలపై నాగేంద్రన్ విమర్శలు చేశారు.
పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన నాగేంద్రన్.. అసెంబ్లీలో విజయ్ పదేపదే “తండ్రి” గురించి ప్రస్తావించడాన్ని ఎగతాళి చేశారు. “మీ తండ్రి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకునేవారు అసెంబ్లీలో సమాధానం కోసం వెతకకుండా ఇంట్లో మీ అమ్మను అడగాలి” అని అన్నారు.
విజయ్, ఆయన తల్లిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించి, కేసు దర్యాప్తులో భాగంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా పోలీసులను కోరారు. 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత అసెంబ్లీలో విజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తండ్రి ఎక్కడ ఉన్నారనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ “కుట్టి కథై” చెప్పారు. ఇది కొళత్తూరులో డీఎంకే అధ్యక్షుడి ఓటమిని ఉద్దేశించిన హాస్యభరిత వ్యాఖ్యగా భావించారు.
ఆ సమయంలో డీఎంకేతో పాటు పలు రాజకీయ పార్టీలు విజయ్ వ్యాఖ్యలను విమర్శించాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్లపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి.. తాను శాసనసభలో లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్నానని అన్నారు. నాగేంద్రన్ తాజా వ్యాఖ్యలపై బీజేపీలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ విమర్శలు వచ్చాయి.
తమిళనాడు మంత్రి ఎ.రాజ్మోహన్ ఈ వ్యాఖ్యలను “అనాగరికమైనవి, అనుచితమైనవి”గా అభివర్ణించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా రాజకీయాల్లో మర్యాద పాటించాలని విజయ్ తన సహచరులను ఎప్పటికప్పుడు కోరారని చెప్పారు.
తమిళనాడు నేత కె.అన్నామలై కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అవి రాజకీయ మర్యాదకు ఉన్న హద్దులను దాటాయని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, రాజకీయ విభేదాలపై చర్చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థించదగిన అంశాలని అన్నామలై చెప్పారు.


