బాలీవుడ్ స్టార్ నటీనటులు అక్షయ్ కుమార్, రవీనా టాండన్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle). ఈ సినిమా జూన్ 26న విడుదలవుతున్న నేపథ్యంలో, ముంబైలో ఉన్న రవీనా టాండన్ లగ్జరీ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైలోని ఈ విలాసవంతమైన ఇంటి విలువ 2025 నాటికి సుమారు రూ. 70 కోట్లు. పదండి ఆ ఇంటి ప్రత్యేకలేంటో తెలుసుకుందాం.
'నీలయ' - ప్రశాంతతకు నిలయం
ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా (Bandra) ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా (Sea-facing) ఈ ఇల్లు ఉంది. 'నీలయ' అంటే సంస్కృతంలో 'ఆశ్రయం' అని అర్థం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్లతో ఈ ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రపంచంలా ఉంటుందని రవీనా ఒక సందర్భంలొ పేర్కొన్నారు. అలాగే ఇంట్లో దాదాపు అన్ని వస్తువులను రవీనా స్వయంగా సెలక్ట్ చేసుకొని కొనుక్కున్నారట. ఇంట్లో భర్త అనిల్ థడానీ, అత్తమామలు, తన ఇద్దరు పిల్లలు - కుమార్తె రాషా, కుమారుడు రణ్బీర్లతో కలిసి నివసిస్తున్నారు.
ఈ ఇల్లు చక్కటి వాస్తు, కేరళ సంప్రదాయ శైలి, మొరాకన్ (Moroccan) ఆర్కిటెక్చర్ల అద్భుత కలయికగా ఉంటుంది. ఇల్లంతా ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్, శిల్పాలతో నిండి ఉంటుంది. ప్రసిద్ధ కళాకారులు పరేష్ మైతీ, తోట వైకుంఠం వంటి వారు సృష్టించిన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద వినాయకుడి శిల్పం స్వాగతం పలుకుతుంది.

శివాలయం స్పెషల్ ఎట్రాక్షన్
ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ దీపావళి వంటి పండుగలకు కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తారు. ఆలయం వెలుపల దక్షిణ భారతదేశం నుండి తెచ్చిన 50 ఏళ్ల నాటి నంది విగ్రహం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించేలా పార్వతీ దేవి విగ్రహాన్ని కూడా అమర్చారు.
ఇదీ చదవండి: మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్
లివింగ్ రూమ్లో మార్బుల్ ఫ్లోరింగ్, ఎర్రటి ఇటుకల గోడలు ఆధునికతను, విలాసాన్ని ప్రతిబింబిస్తాయి. డైనింగ్ రూమ్లో ఫారెస్ట్ గ్రీన్ కలర్ 3D ఉడెన్ ప్యానెల్ గోడ, అద్భుతమైన డిజైన్ గల టేకు టేబుల్, విలాసవంతమైన షాండ్లియర్ (ఝుమర్) ఉన్నాయి. నివేదికల ప్రకారం ఇక్కడ రూ. 10 లక్షల విలువైన బార్ కౌంటర్ కూడా ఉంది. ఇంటి వెనుక భాగంలో కేరళ సంప్రదాయ ఇళ్ల తరహాలో చెక్కబడిన స్తంభాలు, మొరాకన్ శైలి పోర్చ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇది పార్టీలు, గెట్-టుగెదర్లకు చక్కగా సరిపోతుంది.

ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, డైరెక్టర్ అహ్మద్లతో కలిసి పని చేయడం పాత స్నేహితులను మళ్లీ కలుసుకున్నట్లు ఉందని రవీనా ఆనందం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్ గురించి చెబుతూ.. "అప్పట్లో మేమంతా యువకులం, నేర్చుకునే దశలో ఉన్నాం. కానీ ఇప్పుడు అక్షయ్ తన నటనలో పరిపూర్ణత సాధించాడు. సినిమా కోసం ఆయన పెట్టే శ్రమ ఇప్పుడు రెట్టింపు అయ్యింది" అని ఆమె కొనియాడారు.
ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!


