అనుమతి నిరాకరించినా ఆగని విద్యార్థి సంఘం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) సోమవారం జేఎన్యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ రాసిన పుస్తకంపై తలపెట్టిన చర్చా కార్యక్రమాన్ని వర్సిటీ క్యాంపస్లోనే యథా ప్రకారం కొనసాగించింది. ఈ కార్యక్రమాన్ని వాస్తవానికి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భవనంలో నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆ వేదికకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఆదివారం ప్రకటించడం తెల్సిందే.
దీంతో, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్–2 భవనం వెలుపల బహిరంగ ప్రదేశంలో సోమవారం జేఎన్యూ ఉమర్ ఖలీద్ రాసిన ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్: ఆదివాసీ హిస్టరీస్ అండ్ ది పొలిటిక్స్ ఆఫ్ పవర్’పై మధ్యాహ్నం 3 గంటలకు చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమానికి ప్రొఫెసర్లు ప్రభు మహాపాత్ర, ఉమా చక్రవర్తి, శుద్ధబ్రత సేన్గుప్తా, సామాజిక ఉద్యమకారులు హర్‡్ష మండెర్, బనోజ్యోత్స్న తదితరులు హాజరయ్యారు ‘చర్చా వేదికకు అనుమతి నిరాకరిస్తే, చర్చను రద్దు చేసినట్లు కాదు.
ఆలోచన, ప్రశ్నించేతత్వం, చర్చలకు సంబంధించి విద్యార్థులకున్న హక్కును ఎవరూ లాగేసుకోలేరు’అని జేఎన్యూఎస్యూ అనంతరం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర పన్నిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. 2020 సెపె్టంబర్ నుంచి జైలులోనే ఉంటున్నాడు. అప్పట్లో జాతీయ పౌరసత్వ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మక మారి కనీసం 53 మంది చనిపోగా, 700 మంది గాయపడ్డారు.


