ఇండియా Vs భారత్‌.. సెహ్వాగ్‌, బిగ్‌ బీ, ప్రముఖుల స్పందన ఇదే.. | India To Be Renamed As Bharat? Heated Discussion On Social Media - Sakshi
Sakshi News home page

ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్‌, మమతా ట్వీట్లు

Sep 5 2023 2:57 PM | Updated on Sep 5 2023 3:27 PM

India To Be renamed As a Bharat Heated Discussion Social Media - Sakshi

ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మన దేశం పేరు ‘భారత్‌’ లేక ‘ఇండియా’ అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా పేరు మార్పుపై ప్రముఖులు ట్వీట్‌ చేస్తున్నారు. కొంతమంది ‘భారత్‌’ పేరును సమర్ధిస్తుంటే.. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎ‍న్నికల స్టంట్‌ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. 

తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జీ 20 సదస్సు కోసం ప్రెసిడెంట్‌ డిన్నర్‌ ఆహ్వాన పత్రికపై భారత్‌ అని ముద్రించారు. ఇందులో కొత్త ఏముంది. మనం తరుచుగా భారత్‌ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటాం. భారత రాజ్యంగం లేదా భారత్‌ కా సంవిధాన్‌ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ప్రపంచానికి దేశం పేరు ఇండియాగానే తెలుసు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాలని అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.
సంబంధిత వార్త: ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్పు దిశగా కేంద్రం

కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేశ్‌ స్పందింస్తూ.. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని తెలిపింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు. 

ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. ఇది భారతదేశం. రాష్ట్రాల యూనియన్. ఇండియా పార్టీల లక్ష్యం కూడా( Bharat- Bring Harmony, Amity, Reconciliation And Trust) సామరస్యం, స్నేహం, సయోధ్య , నమ్మకాన్ని తీసుకురావడమే.  జూడేగా భారత్.. జీతేగా ఇండియా! అని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. 

ఇక బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చాన్‌ దేశం పేరు మార్పును సమర్ధించారు. ఈ మేరకు ‘ భారత్‌ మాతాకీ జై’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇండియాను భారత్‌గా మార్చాడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశారు. జెర్సీపై కూడా భారత్‌ అని ముంద్రించాలని కోరారు.

కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి చెక్‌ పెట్టేందుకు మోదీ సర్కార్‌ చర్యలు చేపట్టింది. త్వరలో మనదేశం పేరు మారనుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం యోచిస్తోంది. దేశానికి భారత్‌ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు.. ఆహ్వాన పత్రాల్లోప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా బదులు.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌గా కేంద్రం ముద్రించింది.

మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్‌ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారాయన.

కాగా ఇండియా పేరును మార్చాలని కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ఇండియానుంచి భారత్‌గా మార్చాలని తక్షణమే భారత రాజ్యాంగంల నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్‌ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్‌’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. అంతేగాక దేశం పేరును ఇండియా అని కూకుండా భారత్ అని పిలవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. 

అదే విధంగా ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో  తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement