సీఎం సిద్దరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు. | ED Raids MUDA Office In Corruption Case Involving Siddaramaiah | Sakshi
Sakshi News home page

సీఎం సిద్దరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు.

Oct 18 2024 1:58 PM | Updated on Oct 18 2024 3:03 PM

ED Raids MUDA Office In Corruption Case Involving Siddaramaiah

బెంగళూరు:  మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి  మైసూర్‌లోని ముడా కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు  దాడులు చేపట్టారు. 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేసింది. 

దీంతోపాటు మైసూరులోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ముడా చీఫ్‌గా కే మరి గౌడ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు చేపట్టింది. అయితే ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అధికారులందరినీ ఏజెన్సీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ముడా కమిషనర్‌ ఏఎన్‌ రఘునందన్‌ సహా సీనియర్‌ అధికారులు, ప్రత్యేక భూసేకరణ కార్యాలయానికి చెందిన సిబ్బందితో ఈడీ అధికారులు సమావేశం అయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

కాగా సీఎం భార్య బీఎం పార్వతికి విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్‌ల భూమిని అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఈ  వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి  తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement