రాహుల్‌పై బీజేపీ ‘మీమ్స్‌’ వార్‌.. కాంగ్రెస్‌ కౌంటర్‌ | Congress Reaction On Bjp Laapata Rahul Poster Attack | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై బీజేపీ ‘మీమ్స్‌’ వార్‌.. కాంగ్రెస్‌ కౌంటర్‌

Jun 26 2026 4:18 PM | Updated on Jun 26 2026 4:20 PM

Congress Reaction On Bjp Laapata Rahul Poster Attack

ఢిల్లీ: రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ మరో డిజిటల్ వార్‌ మొదలుపెట్టింది. రాహుల్‌ విదేశీ పర్యటనలపై మీమ్స్‌తో పోస్టులు పెడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన తరచూ చేసే విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందంటూ నిలదీసింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ ఇస్తూ.. రాహుల్ గాంధీ గ్లోబల్ లీడర్ అని.. అనేక దేశాలు, సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయంటూ పేర్కొంది.

ప్రముఖ సినిమా టైటిళ్ల ఆధారంగా రూపొందించిన 'ఛడ్ దే ఇండియా' (ఇండియాను వదిలేయ్), 'లాపతా రాహుల్' (కనిపించకుండా పోయిన రాహుల్) పోస్టర్లతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గో రాహుల్ గాన్‌, టూరిస్ట్ జిందా హై, పరదేశ్‌ వంటి మరికొన్ని పోస్టర్లు కూడా వైరల్‌గా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను కలవాలని అనుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన చాలా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలరు కాబట్టి, ఆయన పర్యటనలు చిన్నవిగా, తరచుగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు.

"రాహుల్ గాంధీ కేవలం మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. చాలా మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరుస ఆహ్వానాల కారణంగా ఆయన కేవలం రెండు రోజులు, నాలుగు, ఐదు రోజులు మాత్రమే సమయం కేటాయించి ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీతో ఏకీభవించరని గ్రహించాలి. ప్రజలు భారతదేశాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు, ఆ కోణంలోనే వారు రాహుల్ గాంధీని కూడా చూస్తారు" అని ఖుర్షీద్ పేర్కొన్నారు.

విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేంటి? విదేశాలకు వెళ్లవద్దన్నా ప్రధాని.. ఆ తర్వాత తనే స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్తారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడంటూ ఆయన సమర్థించారు.
 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement