తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో ర్యాలీలు సక్సెస్ అయ్యాయని, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా నోరు మెదపని చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.
‘విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు.
నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ను కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి’ అని పేర్కొన్నారు.
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఏ తేదీల్లో ఏం నిరసన కార్యక్రమ జాబితాను కూడా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు
జూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలు
జూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.
జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
జూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం
జులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు
జులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు
ఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్టేబుల్, టౌన్హాల్ సమావేశాలు
ఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు
ఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు.
మీ కుమారుడు లోకేష్కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబూ ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.
ఆ డిమాండ్ల జాబితా ఇదే..
1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ
2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా
3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెనల చెల్లింపు
4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.
ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?, చంద్రబాబూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా?, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?, ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు,. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. చంద్రబాబూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు.Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ వర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు.… pic.twitter.com/7SSXeSc9zO
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026


