ఇసుక మైనింగ్‌ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం | BJP Leader Burnt Alive After His SUV Was Trapped and Set On Fire | Sakshi
Sakshi News home page

ఇసుక మైనింగ్‌ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం

Jun 18 2026 3:17 PM | Updated on Jun 18 2026 3:23 PM

BJP Leader Burnt Alive After His SUV Was Trapped and Set On Fire

ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్‌ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.

ఏం జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్‌హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్‌ను పిలిచారు ప్రత్యర్థులు.  అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్‌, నాగేంద్ర సింగ్‌ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. 

ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు

గతంలో కాంగ్రెస్‌లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు.  భరత్‌ సింగ్‌కు ఇసుక మైనింగ్‌లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్‌హట్, కైలాష్‌పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా  రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ  (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement