సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు | Tollywood Movie Gandhi Tatha Chettu Trailer Released By Mahesh Babu | Sakshi
Sakshi News home page

సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు

Jan 9 2025 5:07 PM | Updated on Jan 9 2025 5:43 PM

Tollywood Movie Gandhi Tatha Chettu Trailer Released By Mahesh Babu

పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది.  పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్‌ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్‌ మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్‌ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్‌ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి  పురస్కారం  పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్‌ కూతురు అనిపించుకున్నావ్‌ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్‌ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన  ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement