రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పార్ట్-1 బ్లాక్బస్టర్ కావడంతో మేకర్స్ మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు పార్టులు కలిసి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ దాటేశాయి. ఈ వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించాయి.
అయితే ఈ మూవీపై మొదటి నుంచే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇదొక ప్రాపగండ ఫిల్మ్ అనే ముద్ర వేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అంతేకాకుండా పార్ట్-1 రిలీజ్ తర్వాత ప్రాపగండ ముద్రవేసిన కొందరు.. ఈ మూవీకి స్క్రిప్ట్ పీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా దురంధర్ నటుడు రాకేశ్ బేడీ స్పందించారు. అలాంటిదేం లేదని ఆయన ఖండించారు. దిల్లీలో జరిగిన అమృత్ రత్న 2026 సదస్సులో పాల్గొన్న రాకేశ్ బేడీ విమర్శించేవారికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
రాకేశ్ బేడీ మాట్లాడుతూ..'ఈ సినిమా హిట్టయ్యాక ధురందర్ స్క్రిప్ట్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి రాశారని కొందరు అన్నారు. అలాంటి స్టోరీ రాయగల వ్యక్తి పీఎంఓలో ఎవరున్నారో చెప్పండని నేను అడిగా. అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులు ఎవరైనా రాయగలరా? అసలు అక్కడ ఉన్నవాళ్లు ఇలాంటి డైలాగుల గురించి ఆలోచన చేయగలరా? అని వాళ్లను ప్రశ్నించా' అని తెలిపారు.
కాగా.. ఈ స్పై యాక్షన్ మూవీలో రాకేశ్ బేడీ కీలక పాత్రలో మెప్పించారు. జమీల్ జమాలీగా పాకిస్థాన్ రాజకీయ నాయకుడి పాత్రలో అదరగొట్టేశారు. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, గౌరవ్ గెరా, ష్ పాండోర్ కీలక పాత్రల్లో నటించారు.


