
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'అతడు'. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రీరిలీజ్ విషయంలో మహేశ్ సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేయబోతున్నాడు. ఒక పాత సినిమాని ఐమాక్స్ వెర్షన్లోకి మార్చి దానికి 4కె, డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐమాక్స్ తెరకు అనుగుణంగా అతడు సినిమాను కన్వర్షన్ చేస్తున్నారు. అందుకోసం చాలా ఖర్చు అవుతున్నా సరే మేకర్స్ మాత్రం తగ్గడం లేదట. ఐమాక్స్ వెర్షన్లో అతడు సినిమాను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఏ మాత్రం తేడా వచ్చినా తెరమీద బొమ్మ కాస్త విభిన్నంగా కనిపిస్తుంది. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. అందుకే ఒక టెక్నికల్ టీమ్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే వచ్చిన అవుట్ ఫుట్ చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారట.

అతడు సినిమాను ఐమాక్స్ వెర్షన్లోకి కన్వర్షన్ చేయడం వరకు బాగుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఒరిజినల్ ఐమాక్స్ తెర ఒక్కటి కూడా లేదు. ఇండియాలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కేరళలో మాత్రమే ఐమాక్స్ తెరలు ఉన్నాయి. మనకు మాత్రం ఎక్కడా లేవు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఉన్నది పెద్ద తెరే కానీ, ఇందులో కూడా రెగ్యులర్గా వాడే బార్కో ప్రొజెక్టర్నే వాడుతారు. ప్రత్యేకంగా ఐమాక్స్ సంస్థ పంపిణి చేసే పరికరాలు అక్కడ లేవు. దీంతో ఐమాక్స్ వల్ల కలిగే ఖచ్చితమైన అనుభూతి దక్కదు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న ఆసియ అతి పెద్ద స్క్రీన్ విషయంలోనూ ఇదే జరగుతుంది. అతడు సినిమాకు ఎక్కువగా ఫ్యాన్స్ ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారినే టార్గెట్ చేసేందుకే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఓవర్సీస్లో ఈ టెక్నాలజీతో చాలా స్క్రీన్స్ ఉన్నాయి. కాబట్టి వారు ఐమాక్స్లో అతడు సినిమా చూస్తే తప్పకుండా సరికొత్త అనుభూతి వస్తుంది.
అతడు రీ రిలీజ్ హక్కులను రూ. 3 కోట్లకు విక్రయించినట్టు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆపై ఐమాక్స్ వర్షన్తో పాటు 4కె, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ కోసం మరో రూ. 1 కోటి ఖర్చు అవుతుందని సమాచారం. రీరిలీజ్ విషయంలో మహేశ్ సినిమాలకు ప్రత్యేకమైన రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు అన్నీ కూడా రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి.