
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్కు అరుదైన ఛాన్స్ దక్కింది. ఆమె పర్యాటక అభివృద్ధికి అంబాసిడర్గా ఎంపికైంది. అయితే కత్రినాను ఎంపిక చేసింది మాత్రం మన దేశానికి కాదు. గతేడాది మనదేశంతో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన దేశానికి ఆమె గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆ దేశం మరెదో కాదు.. మన దగ్గర్లోనే ఉన్న మాల్దీవుస్.
కత్రినా కైఫ్ను మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించినట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది. భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం రావడంపై బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్పందించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేసింది. మాల్దీవులు అందించే లగ్జరీ, అందాలను సూచించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా తన కొత్త రోల్ గురించి కత్రినా మాట్లాడుతూ.. 'మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. చక్కని ప్రశాంతంగా ఉండే ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నా. ఈ సహకారం ప్రపంచ పర్యాటక ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన గమ్యస్థానం, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా సహాయపడటానికి ఉత్సాహంగా ఉన్నానని" తెలిపింది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. వచ్చే నెలలో మాల్దీవుస్లో ప్రధాని పర్యటించనున్నారు.