బిడ్డని కని వెంటనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. కానీ చివరి క్షణాల్లో డబ్బుల్లేక | EEtha Movie Real Story And Full Details | Sakshi
Sakshi News home page

Eetha real Story: వెండితెరపై మరో బయోపిక్.. స్టోరీ వింటేనే గూస్ బంప్స్

Jun 24 2026 3:53 PM | Updated on Jun 24 2026 4:22 PM

EEtha Movie Real Story And Full Details

బయోపిక్స్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరిగా తీయలే గానీ సీజన్‌తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేటెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ 'ఈటా' పేరుతో ఓ సినిమా చేస్తోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. తీరా చూస్తే ఇదో నిజజీవిత కథతో తీసిన మూవీ అని తెలిసింది. విఠాబాయి అనే ప్రసిద్ధ నృత్య కళాకారిణి జీవితాన్ని ఇప్పుడు వెండితెరపై చూపించబోతున్నారు. ఇంతకీ విఠాబాయి ఎవరు?

(ఇదీ చదవండి: కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే సమంత గెలిచింది)

'ఈటా' సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గొంకర్ బయోపిక్. 1935లో మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌లో జానపద కళాకారుల కుటుంబంలో జన్మించిన ఈమె.. చిన్నప్పటి నుంచే కళావాతావరణంలో పెరిగారు. తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ప్రసిద్ధ భౌ-బాపు మాంగ్ నారాయణ్‌గావంకర్ తమాషా బృందంతో పనిచేసేవారు. వీళ్లంతా మహారాష్ట్రలో సంప్రదాయ జానపద కళలని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు.

కళా సంప్రదాయాల మధ్య పెరిగిన విఠాబాయి.. లావణి, గవలన్, భేదిక్, తమాషా తదితర సంప్రదాయ కళారూపాలను నేర్చుకుని క్రమంగా మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కళాకారిణులలో ఒకరిగా ఎదిగారు. ఈమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 'తమాషా సామ్రాజ్ఞి' అనే బిరుదు కూడా అందుకున్నారు. ఇంత ప్రసిద్ధ డ్యాన్సర్ అయినప్పటికీ ఈమె జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. తండ్రి చనిపోవడంతో కుటుంబ తమాషా బృందం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో విఠాబాయిపైన కుటుంబ బాధ్యతలు పడ్డాయి. దీంతో కళారంగాన్ని విడిచిపెట్టకుండా మరింత అంకితభావంతో తమాషా ప్రదర్శనల్లో పాల్గొనేది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర జానపద సంస్కృతిలో చెరగని ముద్ర వేసింది.

విఠాబాయి ఎంత లెజెండ్‌ అనేది ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. 'ఈటా' మూవీ టీజర్‌లో చూపించినట్లు తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ప్రదర్శనకు సిద్ధమైంది. ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన సమయంలో ఈమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయినా సరే చలించిపోలేదు.స్టేజీ వెనక్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి.. బొడ్డుతాడు స్వయంగా కోసుకుని కాసేపటికే కాళ్లకు గజ్జెలు కట్టుకుని స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలా కళాపట్ల ఈమెకు ఉన్న అంకితభావం ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేసింది.

(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)

అయితే భారత జానపద కళలకు చేసిన సేవలకుగాను విఠాబాయికి 1957, 1990లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారాలు లభించాయి. 2006లో మహారాష్ట్ర ప్రభుత్వం 'విఠాబాయి నారాయణ్‌గొంకర్ జీవిత సాఫల్య పురస్కారం'ని కూడా ప్రారంభించింది. తమాషా కళారంగానికి విశేష సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తోంది.

అయితే ఇంత ప్రసిద్ధ కళాకారిణి అయినప్పటికీ జీవితాంతం ఈమెని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, వ్యక్తిగత కష్టాలు వెంటాడాయి. 2002లో విఠాబాయి చనిపోయే సమయంలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో కన్నుమూసింది. తర్వాత ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు సాయం చేయడంతో దాదాపు రూ.5000 మొత్తాన్ని ఆస్పత్రికి చెల్లించారు. ఇలాంటి విషాదకరమైన విఠాబాయి జీవితాన్ని వెండితెరపై ఎంత ప్రభావవంతంగా చూపిస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

'ఛావా' ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'ఈటా'లో 1940ల నుంచి 1990 వరకు విఠాబాయి జీవితాన్ని చూపించబోతున్నారు. శ్రద్ధా కపూర్‌ టైటిల్ రోల్ చేయగా రణదీప్ హుడా, నానా పాటేకర్, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, సిద్ధార్థ్ జాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తారేమో తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఒక్క స్పీచ్.. చిరంజీవిపై ట్రోలింగ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement