కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో సూర్య నటనపై ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ షాట్స్ ఓటీటీలో నిరాశపరిచాయని పలువురు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. వీటిపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. తాజాగా ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విజువల్ ఎఫెక్ట్స్ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు.. దీనిపై నేను చాలాసార్లు మాట్లాడానని అన్నారు. వీఎఫ్ఎక్స్లో లోపాలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ.. భవిష్యత్ ప్రాజెక్టులలో మెరుగైన ఫలితాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వీఎఫ్ఎక్స్ గురించి వివరిస్తూ..' ఈ షాట్స్లో కొన్ని సన్నివేశాలు పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. వాటి కోసం సీజీఐ కంపెనీలకు ముందస్తు చెల్లింపులు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని చెల్లింపుల షెడ్యూళ్లను.. నిర్మాణ కాలపరిమితులను మా టీమ్ పాటించలేకపోయింది. అవే తుది ఫలితంపై ప్రభావం చూపాయి. 'సింగం' ఫైట్ సీక్వెన్స్ సీన్ను పూర్తి చేయడానికి మేము వీలైనన్ని తక్కువ షాట్లను ఉపయోగించాం. సినిమా ఓటీటీకి వచ్చాక ప్రేక్షకులు లోపాలను గమనిస్తారని మాకు ముందే తెలుసు ఓటీటీ విడుదల తర్వాత ప్రజలు ఎత్తి చూపినవి కొన్ని మాత్రమే. థియేటర్లలో చూసినట్లే ఓటీటీలో కూడా మమ్మల్ని ప్రశంసిస్తూ, సినిమాను ఆస్వాదిస్తున్నారు' అని అన్నారు.
ఈ చిత్రాన్ని ప్రధానంగా థియేటర్లో అనుభూతి కోసమే రూపొందించామని ఆర్జే బాలాజీ తెలిపారు. మీరు ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూసినప్పుడే వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని చూస్తారని అన్నారు. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి.. కానీ ఆ తప్పులను పట్టించుకోకపోవడం కూడా సినిమాలో ఒక భాగమేనని ఆయన అన్నారు. ప్రేక్షకులకు కంటే ముందే మా తప్పుల గురించి తెలుసని అన్నారు. ఓటీటీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పోస్ట్ చేస్తున్న స్క్రీన్షాట్ల కంటే.. నేను అంతకంటే చాలా ఎక్కువ స్క్రీన్షాట్లు తీసుకున్నానని తెలిపారు. ఇది ఒక పొరపాటు.. మిమ్మల్ని నిరాశపరిచినందుకు ఓటీటీ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా.. వచ్చేసారి మేము మరింత మెరుగ్గా చేస్తామని పేర్కొన్నారు.


