విభిన్న కథాంశంతో తీస్తున్న సినిమా 'అబద్ధమేవ జయతే'. ఇందులోని 'అమ్మ కోసం' పాటను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వినోదాత్మక చిత్రానికి కార్తీక్ కొండ కథ, కథనం, దర్శకత్వం వహించారు. కొండ సందీప్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆడపిల్ల పుడితే అది అబద్ధాలు చెప్పిన వారికి శిక్ష అనే నమ్మకంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకుండా నిజాయితీగా జీవించాలని ప్రయత్నించే ఓ భర్త చుట్టూ సాగే వినోదభరితమైన కథతో ఈ చిత్రం తీశారు. నవ్వులతో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందించనుంది. బాబు మోహన్, ప్రవణ్య రెడ్డి, సుశాంత్ యాష్కీ, భాను ప్రకాష్, వికాస్, విజయ ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు.


