నీ కాల్మొక్తా సార్‌.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి... | - | Sakshi
Sakshi News home page

నీ కాల్మొక్తా సార్‌.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి...

Sep 17 2023 6:36 AM | Updated on Sep 17 2023 11:13 AM

- - Sakshi

నర్సాపూర్‌: నీ కాల్మొక్తా సార్‌.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వండి... అంటూ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రి హరీశ్‌రావును కోరారు. శనివారం నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, శివ్వంపేట మండల అధ్యక్షుడు రమణగౌడ్‌, నర్సాపూర్‌ కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ తదితరులు మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శివ్వంపేట మండల అధ్యక్షుడు రమణగౌడ్‌ మాట్లాడుతూ.. కాల్మొక్తా.. మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వండి.. అని కోరగా.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు.. కాళ్లు మొక్కితే టికెట్‌ వస్తదా.. అంటూ ప్రశ్నించారు. నేనే నీ కాల్మొక్తా.. అంటూ మంత్రి కిందకు వంగడంతో అక్కడున్న నాయకులు అవాక్కయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీ టికెట్ల విషయం సీఎం కేసీఆర్‌ చూస్తారని అన్నారు.

మదన్‌రెడ్డి మంచి వారే, ఆయనను మీరే నిమ్మలంగా ఉండనిస్తలేరు అంటూ.. నాయకులకు చురకలు అంటించారు. కాగా చిలప్‌చెడ్‌ మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ సమావేశాల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని, ఎలాంటివ్యాఖ్యలు చేయొద్దని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిసింది. శనివారం మన్సూర్‌ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి హరీశ్‌రావుకు సునీతారెడ్డి వినతి
నర్సాపూర్‌:
నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మంత్రి హరీశ్‌రావును కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి.. పనులకు సంబంధించిన రికార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో బిల్లులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

బీసీ బంధు పథకం కింద అర్హులను ఎంపిక చేసి సాయం అందించేలా అధికారులను ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఆమెతో నర్సాపూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయిమోద్దీన్‌, నాయకులు, సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్‌, మనోహర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎల్లం, ప్రవీన్‌రావు, సుధాకర్‌రెడ్డి, సత్యంగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement