పాపన్నపేట(మెదక్): రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్దీకరించేందుకు తీసుకొచ్చిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్’మెదక్ జిల్లాలో శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇంతవరకు యూరియాకే పరిమితమైన యాప్ బుక్కింగ్ ఇక నుంచి అన్ని ఎరువులకు వర్తించనుంది. రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణానికనుగుణంగా ఎరువులు పంపిణీ చేయనున్నారు.
ఈ సీజన్కు ముగిసిన కాంప్లెక్స్ వాడకం
వానాకాలానికి సంబంధించి 3.67 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని, అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎక్కువ శాతం వరి పంట ఉంటుంది. ఇప్పటికే దాదాపు 2.05 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. దీంతో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఇక తక్కువగానే ఉంటుంది. వరి నారు ఎదగకపోతే కొంతమంది రైతులు, యూరియాతో కలిపి, కాంప్లెక్స్ ఎరువు కొద్ది మోతాదులో వేస్తుంటారు. యూరియా మాత్రం ఇప్పటికే యాప్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయ్యింది. మరో 10 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని భావిస్తున్నారు.
కొత్త యాప్ డౌన్లోడ్ ఇలా..
కొత్త యాప్ వినియోగంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఫర్టిలైజర్ యజమానులు సైతం రైతులకు సహరించాలని చెబుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎస్ఎఫ్ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో భాషను ఎంచుకునే అవకాశముంటుంది. ఆధార్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకవేళ భూమి వివరాలు యాప్లో లేకుంటే రైతు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం ఎరువు రకం ఎంచుకోవాలి. ఏ షాప్లో కొనాలని అనుకుంటున్నారనే విషయం ఎంట్రీ చేయాలి. అప్పుడు సంబంధిత డీలర్ వద్ద రైతు నమోదు చేసిన వివరాలు పీఓఎస్ మెషీన్లో కనిపిస్తాయి. వాటి ఆధారంగా రైతులు తమకు కావాల్సిన ఎరువులను కొనుగోలు చేయవచ్చు.
సాగు చేసిన పంటలకే ఎరువులు నేటి నుంచే యాప్ వినియోగంలోకి


