శివ్వంపేట(నర్సాపూర్): ముఖ్యమైన కనీస అవసరమైన పబ్లిక్ టాయిలెట్లు లేక మండల కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూప్రాన్ నర్సాపూర్ హైవేనుఆనుకుని పీహెచ్సీ, బస్టాండ్, బ్యాంకు, గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి గ్రామంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణంలో కనీస అవసరమైన టాయిలెట్లు లేని పరిస్థితి నెలకొంది. వారంలో రెండు రోజులు గర్భవతులు, బాలింతలు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వస్తే వీరి అవసరం మేరకు టాయిలెట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ప్రయాణ ప్రాంగణం, ఇండియన్ బ్యాంక్ ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎలాంటి టాయిలెట్స్ లేకపోవడం ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కనీస అవసరమైన టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. టాయిలెట్ల నిర్మాణానికి ఆరోగ్య కేంద్రంలో అనువైన ఖాళీ స్థలం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు టాయిలెట్ అవసరం వస్తే మగవారైతే చెట్ల చాటుకు, మహిళలైతే పలు నివాసాల వారి వద్దకు వెళ్లి ప్రాధేయపడి అవసరం తీర్చుకోవలసిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
టాయిలెట్లు లేక రోగులు, ప్రయాణికుల ఇక్కట్లు
పీహెచ్సీలో టాయిలెట్ల నిర్మాణానికి స్థలమున్నా పట్టించుకోని అధికారులు


