పెద్దశంకరంపేట(మెదక్): నిత్యం ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ముందుండే ఆర్ఎంపీ వైద్యుడు తోట రవీందర్ తన మరణానంతరం అవయవాలు దానం చేసి మరికొందరికి పునర్జన్మనిచ్చాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన తోట లక్ష్మణ్కు ఐదుగురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు తోట రవీందర్(40) ఈ నెల2 ఆదివారం గురుపాదగుట్ట వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు రవీందర్ అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు తదితర అవయవాలను దానం చేసి పలువురి జీవితాలను కాపాడిన ఆర్ఎంపీ వైద్యుడు రవీందర్ ఆత్మకుశాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం పెద్దశంకరంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.


