రాయచూరు రూరల్: రైతులను కరువు రక్కసి నుంచి రక్షిస్తాం. పంటల సాగు కోసం తుంగభద్ర ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తామని గదగ్ ఇన్చార్జ్ మంత్రి బసవ రాజ రాయరెడ్డి, కొప్పళ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. శుక్రవారం కొప్పళ జిల్లా కుకనూర్, యలబుర్గ, కుష్టిగి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదికలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి, తగు పరిహారం అందజేస్తామన్నారు. తాగునీటి కోసం తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదిలారన్నారు. కాలువ పైభాగంలో మట్టి కుదించుకుని పోయిన విషయంపై రాజకీయం చేయడం తగదన్నారు.


