సాక్షి,బళ్లారి: బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పట్టు వదలకుండా ఎట్టకేలకు మంత్రి పదవిని దక్కించుకుని బళ్లారికి చేరుకోవడంతో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో మలి విడత కేబినెట్ విస్తరణలో మంత్రి అయిన నాగేంద్ర గురువారం బళ్లారికి చేరుకోవడంతో ఆయనకు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి అనంతపురం రోడ్డు గుండా చేళ్లగుర్కి మీదుగా బళ్లారికి విచ్చేసిన నేపథ్యంలో చేళ్లగుర్కిలో తన ఇష్టదైవం ఎర్రితాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. చేళ్లగుర్కి వద్దకు వేలాది మంది జనం చేరుకుని ఘన స్వాగతం పలికారు. జిల్లాధికారి నాగేంద్రప్రసాద్తో పాటు జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, జెడ్పీ సీఈఓ తదితరులు కూడా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. వేలాది మంది జనం దారి పొడవునా నీరాజనాలు పలికారు. అనంతరం పలువురు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.


