సినిమా స్టోరీలా.. పరువు హత్య | - | Sakshi
Sakshi News home page

సినిమా స్టోరీలా.. పరువు హత్య

Dec 28 2023 12:36 AM | Updated on Dec 28 2023 9:02 AM

- - Sakshi

కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. సినిమా స్టోరీలను మించిన రీతిలో బడా క్రిమినల్స్‌ను తలదన్నేలా హత్యలు

కర్ణాటక: కోలారు జిల్లాలో పరువు హత్యలు కొనసాగుతున్నాయి. కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. సినిమా స్టోరీలను మించిన రీతిలో బడా క్రిమినల్స్‌ను తలదన్నేలా హత్యలు చేయడం గమనార్హం. అలాంటిదే ఈ సంఘటన. తాజాగా ముళబాగిలు తాలూకా నంగలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరవేమన గ్రామంలో పరువు హత్య కొన్ని నెలల తరువాత ఆలస్యంగా వెలుగుచూసింది. రవి అనే వ్యక్తి కూతురు అర్పితను చంపి గడ్డివాములో వేసి నిప్పుపెట్టాడు.

మెట్టినింటి నుంచి తీసుకువస్తూ
వివరాలు.. మరవేమన గ్రామానికి చెందిన రవి కుమార్తె అర్పిత (17) బంధువు అయిన యువకున్ని ప్రేమిస్తోంది. ఇది తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు, దీంతో హడావుడిగా నరసాపురం ఫిర్కా ఓడి కృష్ణాపుర గ్రామానికి చెందిన ఒక యువకునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే అర్పిత అతనితో సంసారం చేయడం ఇష్టపడలేదు. దీనిపై అల్లుడు పదేపదే రవికి ఫిర్యాదు చేసేవాడు. దీంతో రవి మే నెల 21వ తేదీన వెళ్లి కూతురుని తీసుకుని వచ్చాడు. ఊరి సమీపంలో ఉన్న ముష్టూరు గ్రామం వద్ద ఉన్న ఫారం హౌస్‌ వద్ద ఆమెను కొట్టి గొంతు పిసికి చంపాడు. ఆపై ఓ గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. కొద్దిరోజులకు అతడే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

ఫోన్‌కాల్‌తో గుట్టు రట్టు
ఈ కేసు గుట్టు ఎలా వీడిందంటే.. ఇటీవల ఒక ఆగంతకుడు నంగలి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి..రవి దురాగతాన్ని వివరించాడు. దీంతో పోలీసులు రవిని తీసుకువచ్చి విచారణ చేయడంతో నిజం బయటపెట్టాడు. అతన్ని అరెస్టు చేశారు. ఫోరెన్సిక్‌ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి తనిఖీ చేయగా కొన్ని ఎముకలు మాత్రమే లభించాయి. తండ్రి అకృత్యం గ్రామంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ హత్యలో ఇంకా మరికొందరి పాత్ర ఉందా అనే అనుమానాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement