
శివాజీనగర: బళ్లారి, రాయచూరులో ప్రభుత్వం విమానాశ్రయాలు నిర్మించాలని కేఆర్పీపీ ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. విధానసభలో ఆయన మాట్లాడుతూ బళ్లారిలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ డీఎంఎఫ్ నిధి ఉంది. ఈ నిధులో ఉన్న సొమ్మును ఉపయోగించుకొని విమానాశ్రయం నిర్మించవచ్చని తెలిపారు.
అలాగే బళ్లారిలో అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిర్మించేందుకు 200 ఎకరాల అనువైన స్థలం ఉందని చెప్పారు. రాయచూరు యరమరస్లో విమానాశ్రయం నిర్మాణానికి 200 ఎకరాల స్థలం ఉందని, విమానాశ్రయం నిర్మిస్తే కొప్పళతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు అనుకూలమవుతుందని తెలిపారు.
2010లో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.83 కోట్ల ఖర్చుతో అన్ని సదుపాయాలతో భవనం నిర్మించామన్నారు. ఈ ఆసుపత్రికి పరికరాలకు రూ.52 కోట్లు అవసరముందని, ప్రభుత్వం ఈ సొమ్మును విడుదల చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనిచేసేలా చూడాలని కోరారు.