● సంస్థ అక్రమాలపై జడ్జి విస్మయం
బనశంకరి: నైస్ రోడ్డు నిర్మాణానికి కర్ణాటక ప్రదేశ అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) ద్వారా నిర్వహించిన భూస్వాధీన కేసులో వందలాదిమంది రైతులకు బుధవారం హైకోర్టు ఊరటనిచ్చింది. భూస్వాధీనాన్ని రద్దుచేయడాన్ని ప్రశ్నిస్తూ నైస్ సంస్థ వేసిన అప్పీల్ను జడ్జిలు జస్టిస్ డీకే.సింగ్ ధర్మాసనం తిరస్కరించింది. రైతులు తరఫున సీనియర్ న్యాయవాది హెచ్ఎస్.నాగమోహన్దాస్ వాదనలు వినిపించారు. నైస్ సంస్థ అక్రమాలను వివరించగా జడ్జి విస్మయం వ్యక్తంచేశారు. ఆ సంస్థపై ఉన్నతస్థాయి దర్యాప్తు అవసరమని చెప్పారు. రోడ్డు నిర్మాణం నెపంతో చెరువు భూములను ఆక్రమించడం, రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా వారి భూములను లాక్కోవడం, ప్రజల నుంచి పెద్దమొత్తంలో టోల్ ఫీజులను వసూలు చేయడాన్ని జడ్జి తప్పుబట్టారు. ఆ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. సంస్థ మీద స్వతంత్ర దర్యాప్తు, ఫోరెనిక్స్ ఆడిటింగ్ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
మోసగాని వంచన..
తల్లయిన విద్యార్థిని
దొడ్డబళ్లాపురం: మోసగాని ప్రేమపాశంలో చిక్కుకున్న బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలో వెలుగు చూసింది. వివరాలు.. బాలిక హాస్టల్లో ఉంటూ పీయూసీ చదువుతోంది. గూడ్స్ వాహనం డ్రైవర్గా పని చేస్తున్న కరియణ్ణ ఆమెను ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడేవాడు. బాలిక గర్భం దాల్చినా ఆ విషయాన్ని గుట్టుగా ఉంచింది. చివరకు తల్లికి చెప్పడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్లగా మగ బిడ్డ పుట్టాడు. బాలిక వయసు 17 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లీ శిశువును మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రానికి తరలించారు. పోక్సో కేసు నమోదవగానే నిందితుడు కరియణ్ణ పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు.


