బనశంకరి: ఎమ్మెల్సీ సీటును ఇప్పిస్తామని సమాజ సేవకురాలి నుంచి రూ.1.05 కోట్లు కాజేశాడో మోసగాడు. దీనిపై బెంగళూరు హలసూరుగేట్ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు... బాధిత మహిళ (54) ఓ చారిటబుల్ ట్రస్ట్ను నిర్వహిస్తోంది. ఆమెకు ఎర్రిస్వామి అనే మోసగాడు పరిచయమై, తనకు రాజకీయ నాయకులు తెలుసని, మీకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పిస్తానని నమ్మించాడు. రూ.5 కోట్లు ఇస్తే పనైపోతుందని ఆశపెట్టాడు. ఆమె అంత ఇవ్వలేనని చెప్పగా రూ.1.25 కోట్లకు అంగీకరించాడు. ఆమె శిక్షకర సదనలో సిద్దరాజు, బసవరాజు అనేవారికి 2024 ఆగష్టు 10వ తేదీన డబ్బులు అందజేసింది. ఎమ్మెల్సీ సీటు గురించి పార్టీనేతలతో మాట్లాడాలని మహిళను ఢిల్లీకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎర్రిస్వామి తీరుతో ఆవేదన చెందిన మహిళ ఎమ్మెల్సీ సీటు కోసం ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగింది. డబ్బు అడిగితే హత్య చేస్తానని మహిళను బెదిరించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముగ్గురు నిందితులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
31 నుంచి నగల ప్రదర్శన
సాక్షి, బెంగళూరు: దక్షిణ భారతదేశంలోనే ఆకర్షణీయమైన, విశిష్టమైన బంగారు, వజ్రాభరణాల ప్రదర్శన ఆసియా జ్యువెల్స్ షో మరోసారి నగరవాసులను అలరించబోతోంది. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు 3 రోజుల పాటు బెంగళూరులోని రిట్జ్–కార్ల్టన్ హోటల్లో జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఐబీజేఏ జ్యువెలరీ ఇండియా డివిజన్ అధ్యక్షుడు, లక్ష్మి డైమండ్స్ సీఎండీ డాక్టర్ చేతన్ కుమార్ ముఖ్య అతిథిగా జ్యువెల్స్ షో–2026ను ప్రారంభిస్తారు. త్వరలో రాబోయే వరమహాలక్ష్మి, వివాహ, పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అత్యుత్తమ ఆభరణాల డిజైనర్లు, బ్రాండులను ఒకేచోట షాపింగ్ చేసేందుకు, వీక్షించేందుకు ఇదొక చక్కని అవకాశమని నిర్వాహకులు తెలిపారు.


