
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు.
నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి.
కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు..