
గగనతలంపై పాక్ నిషేధ ఫలితం
విమానయాన సంస్థలపై అదనపు భారం
అదనపు వ్యయం, ప్రయాణ సమయంతో ప్రయాణికులకు ఇబ్బందులు
విదేశాలకు ప్రయాణ చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు.
ఇక సుదూర ప్రయాణాలే
పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు.
ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు.
కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు.
అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది.
ఓవర్బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇప్పుడు చేయాల్సిందేమిటి?
→ పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
→ విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్ను తరచూ చెక్ చేసుకోవాలి.
→ అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి.
→ ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్