
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ‘ఆపరేషన్ సింధు’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత, 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా జమ్ముకశ్మీర్కు చెందినవారు.
ఇరాన్ తాజాగా వెయ్యిమంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్ మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తరువాత భారతీయులను రక్షణకోసం టెహ్రాన్(ఇరాన్) నుండి మషద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్ మహాన్ నడుపుతుండగా, న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది.
‘సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఉపశమనం అని జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిని అర్మేనియా, దోహాల మీదుగా భారత్ తరలించారు.
ఇది కూడా చదవండి: ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న 110 మంది విద్యార్థులు