
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థుల తొలి బృందం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విద్యార్థులలో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా, దోహాల మీదుగా తరలివచ్చింది. నిన్న(బుధవారం) సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కారు.
ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతోంది. అక్కడి భారతీయ విద్యార్థులు తమ తరలింపునకు భారత ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. ఈ విషయమై కశ్మీర్లో భారీ నిరసనలు కూడా జరిగాయి. ఇరాన్లో 13 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో అధికశాతం వైద్య విద్య చదువుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ విద్యార్థులను సకాలంలో తరలించినందుకు జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు కృతజ్ఞతలు తెలిపింది.
విద్యార్థుల కోసం ఢిల్లీ నుండి శ్రీనగర్కు వెళ్లే విమానంతో సహా అన్ని విమాన టిక్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిందని విద్యార్థుల సంఘం ‘ఎక్స్’లో తెలిపింది. ఇరాన్లో భారతీయ విద్యార్థులతో పాటు, పలువురు పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ను ఏర్పాటు చేసి, అక్కడి భారతీయులను వెంటనే టెహ్రాన్ను ఖాళీ చేయాలని కోరింది. టెల్ అవీవ్(ఇజ్రాయెల్).. ఇరాన్ అణు కేంద్రాలపై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన దరిమిలా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?