
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్ణణలు నేటికి (గురువారం) ఏడవ రోజుకు చేరాయి. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి విషయంలో అమెరికా ప్రమేయం ఉంటుందా లేదా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాటవేత సమాధానమిచ్చారు. వైట్ హౌస్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా? వద్దా అనే దానిపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ‘నేను అలా చేయవచ్చు. అలా చేయకపోవచ్చు... నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు’ అని ఆయన అన్నారు. ఇరాన్ అధికారులు తమతో సమావేశం అయ్యేందుకు వాషింగ్టన్కు రావాలని అనుకుంటున్నారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నారని జర్మన్ దౌత్య వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ విధమైన దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)కు చెందిన కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుండి రక్షణ కోరుతూ నగరం వెలుపల రహదారులను దిగ్బంధించారు.
ఇరాన్పై దాడి ప్రణాళికలను తాను ఆమోదించానని ట్రంప్ తన సీనియర్ సహాయకులకు చెప్పారని, కానీ టెహ్రాన్ (ఇరాన్) తన అణు కార్యక్రమాన్ని విరమించుకుంటుందో లేదో వేచిచూసే నేపధ్యంలో తుది ఆదేశం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? అని ట్రంప్ను అడిగినప్పుడు ఖచ్చితంగా జరగవచ్చని అన్నారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, తాము అటువంటి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నామని, అయితే తాము ఆ పని చేయబోతున్నామనే అర్థం దీనిలో లేదన్నారు.

ఇదిలావుండగా, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ టెలివిజన్లో ప్రసారమైన రికార్డెడ్ ప్రసంగంలో.. ఈ ఘర్షణల్లో యూఎస్ సైనిక జోక్యం.. నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలని, ఇరాన్ దేనికీ తలొగ్గదని స్పష్టం చేశారు. కాగా ఇజ్రాయెల్ తమ వైమానిక దళం జరిపిన తాజా దాడులలో ఇరాన్ పోలీసు ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్లు తెలిపింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా