ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెజ్బొల్లాకు చెందిన కీలక రహస్య స్థావరాన్ని ఛేదించింది. లెబనాన్లో హెజ్బొల్లాకు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక ఆపరేషన్లలో భాగంగా దక్షిణ లెబనాన్లో కీలక భూగర్భ సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసింది. ఈ బేస్ ఉగ్రవాద సొరంగాల్లో కొన్ని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల బేస్ కేవలం 300 మీటర్ల దూరంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం.
దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా పలు ప్రాంతాలలో భూగర్భ స్థావరాలు నిర్మించే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వైమానిక దాడులు నుండి తమను తాము రక్షించుకోవడంతో పాటు ఐడీఎఫ్ దళాలకు కనిపించకుండా సరిహద్దుల గుండా సైనికులను, ఆయుధాలను, రాకెట్లను రహస్యంగా వేగంగా తరలించడానికి ఈ సొరంగాలు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా జనావాసాల కింద వీటిని ఏర్పాటు చేస్తుండడంతో వీటిపై దాడులు సైతం చేయరాదు. అందుకే హమాస్ పెద్దఎత్తున ఈ భూగర్భ స్వరంగాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో సైనిక చర్య చేపట్టిన ఇజ్రాయెల్ అక్కడ హెజ్బొల్లా ఏర్పాటు చేసిన పలు కీలక స్థావరాలను గుర్తించింది. జనావాసాల ప్రాంతాలతో పాటు మసీదులు, UN బేస్ల కింద వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటిని ఐడీఎఫ్ బలగాల దాడి నుంచి రక్షించుకోవడంతో పాటు ఆయుధాలు రాకెట్లు, డ్రోన్లు, మరియు పేలుడు పదార్థాలను భద్రపరచడానికి ఉపయోగించుకోవడానికి వినియోగిస్తున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజా శాంతి ఒప్పందంలో భాగంగా హెజ్బొల్లాతో నిరాయుధీకరణకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. దశల వారిగా ఇది అమలవుతుందని తెలిపారు. అయితే హెజ్బొల్లా మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.


