
మనిషి ఆహారం కోసం ప్రధానంగా వినియోగించే వాటిలో బియ్యం, గోధుమల తర్వాత మూడవ స్థానంలో బంగాళదుంప నిలిచింది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆహార పంటగా బంగాళదుంప(ఆలూ) చోటు దక్కించుకుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రతీయేటా మే 30 ఇంటర్నేషనల్ పొటాటో డే(International Potato Day)(అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవం) నిర్వహిస్తూ వస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో బంగాళాదుంపలను పండిస్తుంటారు. దక్షిణ అమెరికాలోని ఆండీస్లో తొలుత బంగాళ దుంపలను పండిచారని చెబుతారు. పరిమాణం, రంగు, పోషక విలువల పరంగా 1,500 నుంచి 2,000 విభిన్న రకాల బంగాళాదుంపలు ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. బంగాళాదుంప శాస్త్రీయ నామం సోలనమ్ ట్యూబెరోసమ్. ఇవి నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్కలు. బంగాళాదుంపలు ప్రపంచవ్యాప్తంగా విభిన్న వంటకాల్లో ఉపయోగించే రూట్ వెజిటేబుల్. బంగాళాదుంపలలో అధికశాతంలో పిండి పదార్ధం ఉన్నందున వాటిని మితంగా తినాలని నిపుణులు చెబుతుంటారు.
బంగాళాదుంపలో కేలరీలు: 168, కొవ్వు: 0 గ్రాములు, ప్రోటీన్: 5 గ్రాములు, కార్బోహైడ్రేట్లు: 37 గ్రాములు, ఫైబర్: 4 గ్రాములు, సోడియం: 24 మిల్లీగ్రాములు, విటమిన్ సి: 37%, విటమిన్ బీ6: 31%, పొటాషియం: 27%, మాంగనీస్: 20% ఉంటాయి. బంగాళాదుంపలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఆరోగ్యకరమైనవని చెబుతుంటారు. దీనిలో లభించే ఖనిజాలు మెరుగైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని వివిధ పరిశోధనల్లో తేలింది. జీర్ణక్రియకు, వృద్ధాప్య లక్షణాలతో పోరాడేందుకు కూడా బంగాళ దుంపలు దోహదపడతాయి. బంగాళాదుంపలు ఆకలిని తగ్గించడం ద్వారా శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయి. మితంగా తీసుకుంటే, బంగాళాదుంపలు(Potatoes) ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. భారతదేశంలో ఉత్పత్తయ్యే బంగాళాదుంపలలో ఎక్కువ భాగం ఉత్తర ప్రదేశ్ నుండే వస్తాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్లలో బంగాళదుంపలను విరివిగా పండిస్తారు.
ఇది కూడా చదవండి: జోదా- అక్బర్ల పెళ్లి పచ్చి అబద్ధం: రాజస్థాన్ గవర్నర్