బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని  | Indian Student Dies In Canada | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని 

Apr 20 2025 3:56 AM | Updated on Apr 20 2025 11:08 AM

Indian Student Dies In Canada

రెండు కార్లలోని వ్యక్తుల మధ్య కాల్పులు 

దూసుకొచ్చిన బుల్లెట్‌ తగిలి బస్టాప్‌లో చనిపోయిన హర్‌సిమ్రత్‌కౌర్‌ 

కెనడాలో విషాద ఘటన

న్యూయార్క్‌/తరన్‌ తారన్‌(పంజాబ్‌): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్‌ గాయాలకు బలైంది. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్‌సిమ్రత్‌ కౌర్‌ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్‌ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్‌లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్‌ కుటుంబసభ్యులు డిమాండ్‌చేశారు. 

అసలేం జరిగింది? 
ఉన్నత విద్య కోసం సిమ్రత్‌ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్‌ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్‌లోని అప్పర్‌ జేమ్స్, సౌత్‌ బెండ్‌ రోడ్‌ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్‌లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్‌లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్‌ సిమ్రత్‌ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి.  
 


వీడియోలు ఉంటే ఇవ్వండి 
ఘటనపై హ్యామిల్టన్‌ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్‌లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్‌క్యామ్‌ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్‌ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement