bullet kills
-
బుల్లెట్కు బలైన భారతీయ విద్యార్థిని
న్యూయార్క్/తరన్ తారన్(పంజాబ్): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది. పంజాబ్లోని తరన్ తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ కౌర్ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్ కుటుంబసభ్యులు డిమాండ్చేశారు. అసలేం జరిగింది? ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సిమ్రత్ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి. వీడియోలు ఉంటే ఇవ్వండి ఘటనపై హ్యామిల్టన్ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్క్యామ్ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది. -
ప్రియుడి పుర్రెలో నుంచి ప్రియురాలికి బుల్లెట్..
వాషింగ్టన్: ఓ యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం అతడి ప్రియురాలి ప్రాణం తీసింది. తన తలకు తుపాకీ గురిపెట్టుకొని కాల్చుకోగా అతడికి మాత్రం గాయంకాగా అతడి ప్రియురాలు మాత్రం మృత్యువాత పడింది. ఈ ఘటనకు సంబంధించి అతడు ఆదివారం కోర్టుకు రాగా, అతడిపై సెకండ్ డిగ్రీ హత్యగా పేర్కొంటూ అమెరికా కోర్టు అతడిపై అభియోగాలు ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే.. విక్టర్ సిబ్సన్(21) అనే యువకుడు, బ్రిటనీ మే హాగ్ (22) అనే యువతి ప్రేమికులు. అయితే, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సిబ్సన్ తుపాకీతో కాల్చుకోగా అతడి తల పుర్రెపై భాగంలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ నేరుగా అతడి ప్రియురాలు హాగ్ కణతలోకి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయంతో హాగ్ చనిపోగా అతడు మాత్రం పుర్రె పైభాగం నుంచి బుల్లెట్ దూసుకుపోయిన కారణంగా బతికిబయటపడ్డాడు. అయితే, అకారణంగా అతడి ప్రేయసి ప్రాణాలుపోవడానికి కారణమైనందున అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపిన అధికారులు ఒకే బుల్లెట్ వారిద్దరి తలలోకి దూసుకెళ్లినట్లు తేలింది. దీని ప్రకారం వారిద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడే యత్నం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.