బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం | Balochistan Road Accident: Overloaded Bus Plunges Into Ravine News | Sakshi
Sakshi News home page

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

Jul 3 2026 1:02 PM | Updated on Jul 3 2026 1:02 PM

Balochistan Road Accident: Overloaded Bus Plunges Into Ravine News

క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్‌ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

బస్సు ఒవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement