దూరమవుతుందనే దారుణం | - | Sakshi
Sakshi News home page

దూరమవుతుందనే దారుణం

May 31 2023 9:02 AM | Updated on May 31 2023 9:59 AM

- - Sakshi

హైదరాబాద్: సహజీవనం చేస్తున్న బి.చంద్ర మోహన్‌ చేతిలో దారుణంగా హతమైన మాజీ హెడ్‌ నర్సు వై.అనురాధ కేసులో స్పష్టత వచ్చింది. కొన్నేళ్లుగా చంద్రమోహన్‌తో సన్నిహితంగా ఉంటున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించడంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మలక్‌పేట ఏసీపీ శ్యామ్‌సుందర్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌, డీఐ ఎల్‌.భాస్కర్‌రెడ్డిలను కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం అభినందించారు.

బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారికి సర్టిఫికెట్లు, నగదు పురస్కారం అందించారు. అనురాధ, చంద్ర మోహన్‌ 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇతడు అనురాధ నుంచి 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. చాన్నాళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని భావించి ఓ మాట్రిమోనియల్‌ సైట్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే కాల్స్‌ను ఆమె రహస్యంగా మాట్లాడుతోంది. దీంతో చంద్రమోహన్‌కు అనుమానం వచ్చింది.

ఈ నెల 12న అనురాధ గదికి అతను వచ్చిన సందర్భంలో ఆమె తన ఫోన్‌ వదిలి స్నానానికి వెళ్లింది. అప్పుడే ఆ ఫోన్‌ చూసిన చంద్రమోహన్‌కు ఆమె రెండో పెళ్లి ప్రయత్నాల విషయం తెలిసింది. అప్పటికే ఆమె వద్ద ఉన్న రూ.30 లక్షలు తనకే దక్కాలని భావించిన చంద్రమోహన్‌ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తే ఆమె తనకు దూరమవుతుందని అనుకున్నాడు. దీంతో అనురాధతో ఘర్షణకు దిగి దారుణంగా హత్య చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement