
సందర్భం
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష జోక్యానికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తూ పోతే అంతిమంగా తోస్తున్నది ఒకటే. అది – క్రమంగా బలహీనపడుతున్న ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థిరపరచుకోవా లన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం. ఇరాన్ అణ్వస్త్రాల ఉత్పత్తికి సమీపంలో ఉందా దూరంగానా, శాంతి చర్చలకు సిద్ధమా కాదా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అస్తిత్వ ప్రమాదం ఏర్పడిందా లేదా అనేవన్నీ పైకి కనిపించే మిథ్యా సంవాదాలు.
ఇంతవరకు దౌత్య చర్చల తెర వెనుక దాగి తన యుద్ధ మంత్రాంగాన్ని సాగించిన ట్రంప్, ఇరాన్ను ఇజ్రాయెల్ ఓడించటం తేలిక కాదని అర్థమవుతుండటంతో, నిజ స్వరూపంతో తెర ముందుకు వచ్చారు. తాము, ఇజ్రాయెల్ ‘ఒక టీమ్గా పని చేస్తూ వస్తున్నా’మని ఎటువంటి దాపరికం లేకుండా, జూన్ 21 నాటి దాడుల తర్వాత 22న ప్రకటించారు.
బిట్వీన్ ద లైన్స్
ఎదుటిపక్షంతో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబు దాడులు జరిపిన ఉదంతాలను ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎపుడైనా విన్నామా? ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి, అమె రికాకు అయిదు విడతల చర్చలు జరిగి ఆరవది ఈ నెల 15న జరగనుండగా రెండు రోజుల ముందు 13న ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది. ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది. తమ దాడికి సరిగా ఒకరోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ, చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్కు 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. అయినా మరునాడే దాడి చేశారు. ఇదే ఒక ద్వంద్వ నీతి కాదా?
ఇంతకూ గత అమెరికన్ ప్రభుత్వాలు సాగించిన యుద్ధాలను తీవ్రంగా ఖండించి, తన హయాంలో ఆ పని జరగబోదని తన ఎన్నికల ప్రచార సమయం నుంచే పదేపదే హామీ ఇస్తూ వచ్చిన ట్రంప్, ఇపుడీ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్య వాదపు ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అవసరం ఎటువంటిదనే చర్చలు తరచూ జరిగేవే గనుక ఇపుడు తిరిగి చెప్పుకోనక్కర లేదు. కానీ అంతకుమించిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
అవి స్వయంగా ట్రంప్ మాటలు, చేతల ద్వారా రూపుదిద్దుకుంటున్నవే. తన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదానికి, అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాధిపత్య స్థాయిని కోల్పోతుండటానికి, ప్రస్తుతం ఇరాన్తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది.
ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, అణు పరిశోధనలు, పశ్చిమాసియా, చమురు నిల్వలు, ఆ ప్రాంతపు భౌగోళికతలకు పరిమితమైనది కాదు. 21 నాటి తమ సైనిక శక్తి ప్రద ర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంప దలచింది. తన ఏకధ్రువ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకో గలమని చెప్పటమే ఆ సందేశం.
ఈ మాటపై సందేహం గలవారు 21 నాటి దాడుల తర్వాత మొదట ట్రంప్ చేసిన ప్రసంగాన్ని, తర్వాత అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కురిల్లాతో కలిసి రక్షణమంత్రి పీట్ హెగ్సెట్ మీడియా సమావేశంలో అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లిష్లో ‘రీడింగ్ బిట్వీన్ ద లైన్స్’ అనే మాట ఉంది.
పైకి చెప్పే మాటల అర్థాన్నే గాక వాటి అంతరార్థాన్ని కూడా చూడటమన్నమాట. వారు ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం, శాంతి చర్చల రూపంలో ఇరాన్ తమకు బేషరతుగా లొంగటం, కాదని దాడులు జరిపితే సర్వనాశనానికి ఇరాన్ సిద్ధపడటం అని చెప్పేందుకే పరిమితం కాలేదు.
ఆ తరహా దాడులు ఎంత ఘనమైనవో, తమ వంటి సైనిక శక్తి యావత్ ప్రపంచంలో మరే దేశానికి ఎట్లా లేదో, అటువంటి దాడులు మరెవరు ఎట్లా చేయలేరో ఒకటికి నాలుగుసార్లు కఠిన స్వరంతో, తీక్షణమైన ముఖ కవళికలతో చెప్తూ పోయారు.
గత యుద్ధాల చరిత్రను గమనిస్తే సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలచిన ప్రతిసారీ, లేదా అటువంటి ఆధిపత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ, అంతర్జాతీయ చట్టాలూ రూల్ ఆఫ్ లా అని తామే సృష్టించి జపించేవాటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ, కేవలం సైనిక బలంతో ఆధిపత్యం కోసం సరిగా ఇటువంటి మాటలే చెప్తూ వచ్చారు. గత 10–15 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతూ మథనపడుతున్న అమెరికాకు, ఆ స్థాయిని తిరిగి చతురోపాయాలతో నిలబెట్టుకోవటం అన్నింటికీ మించిన పరమ లక్ష్యంగా మారింది.
సామ్రాజ్యవాద డైనమిక్స్
ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది. తాను యుద్ధాలు ఆపానని, ఇంకా ఆపుతానని, శాంతి దూతనని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు. కానీ అర్థం చేసుకోని విషయాలు రెండున్నాయి.
ఒకటి–తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపా దించినదే. రెండు – అట్లా కోల్పోవటం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించి అందుకు అనుగుణంగా సర్దు బాట్లు చేసుకోవటానికి బదులు, పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటే అందుకు చివరి ఆధారం తిరిగి సైనిక శక్తే అవుతుంది.
అంతర్జాతీయ చట్టాలకు, నాగరికమైన ప్రజాస్వామ్య వ్యవహరణకు కట్టుబడే డైనమిక్స్ ఒక విధంగా ఉంటే, అన్నింటినీ ఒకవైపు వల్లిస్తూనే యథేచ్చగా ఉల్లంఘించే సామ్రాజ్యవాదపు డైనమిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్న విధంగానే ఉంటాయి. అది ‘సామ్రాజ్య వాదం’ అనే వ్యవస్థలోనే అంతర్నిహితమై భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటా దర్శనమిస్తుంది.
ప్రపంచంలోకెల్లా అతిగొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా, బ్రిటన్లు, పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని చాటుకునే ఇజ్రాయెల్ల అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథ మవుతుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సీఐఏ, ఎంఐ–6ల ద్వారా కూలదోసి నియంతలను అధికారానికి తెచ్చాయి.
అందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ. అక్కడ ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాది చమురు బావులను జాతీయం చేయగా, తనపై 1953లో సైనిక కుట్ర జరిపించి షా పెహ్లవీ నియంతృత్వాన్ని తెచ్చారు. ఇపుడు ‘రెజీమ్ ఛేంజ్’ (ప్రభుత్వ మార్పిడి) పేరిట మరొక పెహ్లవీ వంశ వారసుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి ట్రంప్ ‘మాగా’ నినాదంలోనే, పదవీ బాధ్యతలు స్వీకరించి తొలినాళ్ల నుంచి తీసుకుంటున్న చర్యలలోనే ఇదంతా తార్కికంగా కనిపిస్తుంది. వలసదారుల నిరోధానికి, పంపివేతకు సైన్యాన్ని నియోగించటం వరకు వెళ్లారు. ట్యారిఫ్ల యుద్ధంతో యావత్ ప్రపంచం ఒకేసారి తమకు పాదాక్రాంతం కావాలనుకున్నారు.
రష్యా, చైనాల వద్ద అణ్వస్త్రాలతో కూడిన సైనిక బలం లేనట్లయితే గత కాలపు సామ్రాజ్యవాద పద్ధతులలోనే వనరులు, మార్కెట్ల కోసం దాడులు జరిపే వారే! టారిఫ్లకు సంబంధించి కాకున్నా, వనరులూ, మార్కెట్ల విషయమై ఆ రెండు దేశాలతో కాకున్నా, ఇతరత్రా సైనిక బలాన్ని ట్రంప్ మార్కు సామ్రాజ్యవాదం వినియోగిస్తూనే ఉంది.
ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మొత్తం దేశాన్నే రాతియుగపు పరిస్థితికి నిర్ధూమధామం చేస్తాం అనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా? ఆఫ్రికాలోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ను కొనసాగిస్తామనటం అక్కడి అపారమైన వనరుల కోసం కాదా? బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్, డీ–డాల రైజేషన్లను బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదా? అందువల్ల ట్రంప్ ‘మాగా’ నినాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం. ఈ జూన్ 21 నాటి బంకర్ బస్టర్ల సైనిక బల సందేశం, క్రమంగా బలపడు తున్న బహుళ ధ్రువ ప్రపంచానికి సామ్రాజ్యవాదపు ‘బిట్వీన్ ద లైన్స్’ సందేశం!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు