ఎవరు దేశ పౌరులు? | Central Government Makes Statement On National Citizenship Guest Column Special Story | Sakshi
Sakshi News home page

ఎవరు దేశ పౌరులు?

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

Central Government Makes Statement On National Citizenship Guest Column Special Story

పాస్‌పోర్ట్‌ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.

మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్‌ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్‌ 5 ప్రకారం, భారత్‌లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.

ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్‌ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్‌ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్‌ ద్వారా కూడా సెక్షన్‌ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.

పాస్‌పోర్ట్‌కు ఎవరు అర్హులు? 
పాస్‌పోర్ట్‌ చట్టం–1967లో పాస్‌పోర్ట్‌ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం, పాస్‌పోర్ట్‌ అధికారి, పాస్‌పోర్ట్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్‌పోర్ట్‌ పొందే అర్హత లేదు.

మరెందుకు భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్‌ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్‌పోర్ట్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.

చట్టం ప్రకారం పాస్‌పోర్ట్‌ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్‌పోర్ట్‌ పొందినా, సెక్షన్‌ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్‌పోర్ట్‌ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.

అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్‌పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్‌పోర్ట్‌ దేశ  పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్‌ కార్డ్, రేషన్‌ కార్డ్, పాన్‌ కార్డ్‌ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్‌. హరీశ్‌ కుమార్‌, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement