రాయ్పూర్లో మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోతున్న తన ప్రేయసిని ఆపేందుకు ఓ వ్యక్తి కారు బానెట్పైకి ఎక్కాడు. దీంతో ఆమె స్నేహితుడు కారును ముందుకు నడపడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఆమానక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మృతుడు పరంప్రీత్ సింగ్ వ్యాపారవేత్త. అతను ఆ మహిళతో సుమారు 3-4 ఏళ్లుగా సన్నిహిత సంబంధంలో ఉన్నాడు. వారి కుటుంబాలు కూడా వారి వివాహం గురించి చర్చించి, పెళ్లి నిర్ణయానికి వచ్చినట్లు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
పరంప్రీత్ తన ప్రేయసిని ఆమె స్నేహితుడు భరత్ మంగ్నానితో కలిసి చూడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ పరంప్రీత్ కారులో జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ.. భరత్ మంగ్నానితో కలిసి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీనిని పరంప్రీత్ వ్యతిరేకించి వారిద్దరినీ నిలదీశాడు. భరత్ కారును తన కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత భారత్ కారును ముందుకు నడిపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగ్వాదం తర్వాత పరంప్రీత్ కారు పైకప్పుపైకి ఎక్కాడు. కారు సుమారు 200 మీటర్ల దూరం వేగంగా వెళ్లిన తర్వాత పరంప్రీత్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం కారు అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కారు కింద పడడంతో అతడి శరీరంలోని కొంత భాగం నుజ్జునుజ్జయింది.
పరంప్రీత్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. దృశ్యాలు, ఘటన పరిస్థితుల ఆధారంగా హత్యకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కోసం కేసు నమోదు చేశారు.
ఘటనకు ముందు పరంప్రీత్, భరత్ మంగ్నాని మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పరంప్రీత్ను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం జరిగినట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. ఘటనలో అసలు ఏం జరిగిందో, ఈ ఘర్షణకు కారణమేంటో నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. కారు నడిపిన భరత్ మంగ్నాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


