ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు | Iphones theft while doing job at hyderabad | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు

May 9 2025 12:32 PM | Updated on May 9 2025 3:32 PM

Iphones theft while doing job at hyderabad

సనత్‌నగర్‌: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్‌డీఆర్‌ ఆర్‌డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్‌ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్‌ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన  ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్‌ ఆడిట్‌ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్‌ అంకిత్‌పాత్ర సెల్‌ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్‌ ఉద్యగి తిలక్‌కుమార్‌ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

వివాహిత అదృశ్యం 
సికింద్రాబాద్‌: భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్‌ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్లో జనరల్‌ టికెట్‌ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్‌ ఫాం నంబర్‌ 1లోని  గేట్‌ నంబర్‌ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్‌ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్‌ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మెట్రో స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య 
చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement