Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి | Hit And Run Incident In Jaipur | Sakshi
Sakshi News home page

Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి

May 1 2025 2:34 PM | Updated on May 1 2025 3:57 PM

Hit And Run Incident In Jaipur

జైపూర్‌ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం తాగిన ఓ యువతి ఓ మైనర్‌ బాలిక ప్రాణం తీసింది. తన కారుతో బాలిక వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి జైపూర్‌లోని సంగనీర్ గేట్ సమీపంలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ఆసిమా తన తండ్రితో పాటు కజిన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు.

సరిగ్గా సంగనీర్‌ గేటు సమీపంలో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ఆసిమా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆసిమా మృతి చెందింది. ఆమె తండ్రి, బంధువు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైక్‌ను ఢీకొట్టిన అనంతరం యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. రాంగ్‌ రూట్‌లో వెళుతూ మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారమైన యువతిని, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో కారు డ్రైవ్‌ చేసిన యువతి అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు.

 పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నిస్తుండగా సదరు యువతి పోలీసుల్ని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కారు నడిపిన యువతి నాగ్‌పూర్‌కు చెందిన సంస్కృతిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ పరీక్ష నిర్వహించి అరెస్టు చేశారు. కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement