
జెన్సోల్ వ్యవహారంపై విజయ్ కేడియా వ్యాఖ్యలు
జెన్సోల్ ఇంజినీరింగ్ వంటి మోసపూరిత కంపెనీల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ మార్కెట్ నిపుణులు విజయ్ కేడియా హెచ్చరించారు. మార్కెట్లో ఇంకా చాలా మంది ‘జెన్సోల్స్’ దాగి ఉన్నారని తెలిపారు. వీరి కంపెనీలు ప్రస్తుతం సెబీ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కాలక్రమేణా ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కంపెనీల్లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నట్లు గమనిస్తే సెబీ దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతుందని చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు తప్పవని సూచించారు. సెబీ హెచ్చరికలు జరగబోయే ప్రమాదానికి ముందు రెడ్ఫ్లాగ్లాగా పని చేస్తాయన్నారు. ఇది పెట్టుబడిదారులకు ఇలాంటి ప్రమాదకరమైన స్టాక్స్ నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుందని చెప్పారు. మార్కెట్లో ఇంకా చాలామంది ‘జెన్సోల్స్’ దాక్కున్నారని, సమయం గడిచేకొద్దీ బయటకు వస్తారని పేర్కొన్నారు. ఇది ఆలస్యం కాకూడదని ఆశిద్దామన్నారు.
లిస్డెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్ను ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ సొంత (ప్రొప్రయిటరీ) సంస్థలా వాడుకున్నట్లు క్యాపిటల్మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. వెరసి వీరిరువురూ జెన్సోల్ సహా ఏ ఇతర లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్లుగా లేదా కీలక యాజమాన్య స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు వీలుండదు. అంతేకాకుండా తదుపరి నోటీసు జారీ చేసేటంతవరకూ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలకూ అనుమతించమని సెబీ పేర్కొంది. నిధుల మళ్లింపునకుతోడు పాలనా సంబంధ అక్రమాలను గుర్తించడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది.
ఏం జరిగిందంటే..?
లిస్టెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్కు చెందిన కార్పొరేట్ నిధులను జగ్గీ బ్రదర్స్ అక్రమ మార్గంలో వినియోగించినట్లు 29 పేజీల మధ్యంతర ఆదేశాలలో సెబీ పేర్కొంది. వీటి ప్రకారం గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్లో హైఎండ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. విలాసవంత గోల్ఫ్ సెట్ను సొంతం చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, దగ్గరి బంధువులకు నిధుల బదిలీ తదితరాలను చేపట్టారు. తద్వారా దగ్గరి బంధువుల వ్యక్తిగత ప్రయాణాలు, విలాసాలకు సైతం నిధులు వెచ్చించారు. వెరసి లిస్టెడ్ కంపెనీని పిగ్గీ బ్యాంకులాగా మార్చుకున్నారు.
ఇదీ చదవండి: ‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
ఇవికాకుండా ఫైనాన్షియల్ పీఎస్యూ దిగ్గజాలు ఇరెడా, పీఎఫ్సీల నుంచి ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోళ్ల కోసం తీసుకున్న రూ. 978 కోట్ల రుణాలను అక్రమంగా వినియోగించారు. 6,400 ఈవీ కొనుగోళ్లకు రూ. 664 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొనగా.. 4,704 వాహనాలను మాత్రమే ప్రొక్యూర్ చేసినట్లు ఫిబ్రవరిలో సెబీకి వెల్లడించింది. ఈవీలను బ్లూస్మార్ట్కు లీజుకిచ్చారు. అయితే 4,704 ఈవీలకు రూ. 568 కోట్లు మాత్రమే చెల్లించినట్లు గో ఆటో టెడ్ వెల్లడించింది. అయితే 20% అదనపు ఈక్విటీ చెల్లింపులతో కలిపి ఈవీలకు జెన్సోల్ రూ. 830 కోట్లు కేటాయించింది. అంటే వీటిలో రూ. 262 కోట్లు లెక్కతేలాల్సి ఉంది. కాగా.. జెన్సోల్, గో ఆటో బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే గో ఆటోకు చెల్లించిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జెన్సోల్ సంబంధిత సంస్థలలోకి చేరడం గమనార్హం! కాగా, బ్లూస్మార్ట్ క్యాబ్ సర్వీసులు 3 మెట్రో నగరాల్లో నిలిచిపోయాయి.