బంగారం ఎందుకో చిన్నబోయింది! | India Gold Demand Drops in Q2 but Value Hits Record Rs 1.98 Lakh Crore: WGC | Sakshi
Sakshi News home page

బంగారం ఎందుకో చిన్నబోయింది!

Jul 30 2026 1:49 PM | Updated on Jul 30 2026 1:51 PM

India Gold Demand Drops but Hits Record Rs 1 98 Lakh Cr know Details

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం క్షీణించిన డిమాండ్!

అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులను కొనుగోళ్లకు దూరంగా ఉంచుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న గోల్డ్‌ విక్రయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికం కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా ‘క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి వినియోగం నమోదైంది.

పరిమాణం తగ్గినా.. విలువలో ఆల్‌టైమ్ రికార్డు!

బంగారం కొనుగోలు పరిమాణంలో తగ్గుదల కనిపించినప్పటికీ ఆకాశాన్నంటిన ధరల కారణంగా విలువ రూపంలో బంగారం వాణిజ్యం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగ విలువ గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరింది. 2025 క్యూ2లో ఇది రూ.1,32,500 కోట్లుగా ఉంది. భౌతిక పరిమాణం తగ్గినా భారతీయుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో పసిడికే ప్రథమ స్థానం దక్కుతోందని డబ్ల్యూజీసీ భారత ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.

ఆభరణాల విక్రయాలపై దెబ్బ.. కారణాలివే..

డబ్ల్యూజీసీ సమాచారం ప్రకారం, అత్యధిక క్షీణత ఆభరణాల (జువెల్లరీ) విభాగంలోనే నమోదైంది. క్యూ2లో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు (గతేడాది 88.8 టన్నులు) పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలు..

  • పసిడి ధరలు నిరంతరం రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనుకావడం, వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం.

  • దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో రీటైల్ ధరలు మరింత పెరిగాయి.

  • సుంకాలు పెరగడంతో అక్రమ రవాణా పెరిగిపోతోందని, ఇది అధికారిక బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

కోలుకునే అవకాశం!

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది మొత్తానికి భారత్‌లో పసిడి డిమాండ్ 650-750 టన్నుల మధ్య నమోదుకావచ్చు. రాబోయే పండుగల సీజన్‌లో (దసరా, దీపావళి) ధరలు కొంత సద్దుమణిగితే బంగారం కొనుగోళ్లు తిరిగి పుంజుకుని మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement